సామాన్య ప్రశ్నలకు జవాబుల శ్రేణి

శాం షమూన్

ప్రశ్న:

యేసు క్రీస్తు ప్రభువు దేవుడైతే, ''నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి'' అని ఎవరికి ప్రార్థన చేయుచున్నారు? (మార్కు 15:34; మత్తయి 27:46) తాను తనకే ప్రార్థన చేసుకుంటున్నారా? అదే వాస్తవం అయితే, తనను తానే చెయ్యి విడిచిచానని తాను తనకే ఫిర్యాదు చేసుకుంటున్నారా?

జవాబు:
పరిశుద్ధ గ్రంథములో దేవుని గూర్చి ఏమని వ్రాయబడినదనగా, "దైవం" అనగా అవిభక్తమై ఎవరూ వేరుచేయ సాధ్యముకాని ముగ్గురు విడి విడి వ్యక్తులు, అనగా తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ. వీరు అవిభక్తముగా ఏకమై ఉంటూ అద్వితీయ త్రియేకదేవునిగా ఉన్నారని తెలియజేస్తుంది. దైవంలోని ముగ్గురు వ్యక్తులూ నిత్యమూ అవిభక్తమైన వారు కాబట్టి, వారి మధ్య ఒకరిపట్ల మరొకరికి ప్రేమగల అన్యోన్య సహవాసము మరియు సంభాషణ కలిగి ఉంటారు. కాబట్టి,  ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మీద తాను తనకే ప్రార్థన చేసికొనుటలేదు, గానీ సాక్షాత్తు తండ్రియైన వ్యక్తికి ప్రార్థన చేయుచున్నారు.

మరియు, యేసు క్రీస్తు ప్రభువు మానవునిగా వచ్చారు, నిరంతరము మానవ స్వరూపములోనే ఉంటారని పరిశుద్ధ గ్రంథము బోధిస్తుంది. కాబట్టి, దేవునియందు భయభక్తులు కలిగిన ఏ వ్యక్తియైనా ప్రార్థించి ఆరాధించవలసిన విధముగా క్రీస్తు కూడా చేయడము ఆశ్చర్యము కాదు. దేవుడు మనుష్యులందరిని ఏ విధంగా ఉండాలని ఉద్దేశించాడో అలాగే యేసు క్రీస్తు ప్రభువు కూడా మానవ స్వరూపములో ఉండినప్పుడు, సంపూర్ణమైన దైవ సేవకునిగా నిజదేవునికి సంపూర్ణముగా లోబడి ఉండి, తాను తండ్రిని ఆరాధించుట ద్వారా మానవులకు మంచి మాదిరి ఉంచి వెళ్ళారు.

లేఖనముల ప్రకారము, దేవుని యొక్క తీర్పు మరియు ఉగ్రతను ప్రభువైన యేసు తనపైన వేసుకొని మనకు బదులుగా చనిపోవడానికి వచ్చారు. క్రీస్తు మన పాపములను మోసినవారు కాబట్టి ఆ సందర్భములో ఆయన తండ్రికి “నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయ్యి విడిచితివి” అని కేక వేశారు.

''మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగా చూచి ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల'' అన్నాడు. (యోహాను 1:29)

''పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిని కనువరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరచునిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన ఆలాగు చేసెను.'' (రోమా 3:25-26)

''అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో  సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను.'' (2 కొరింథీయులకు 5:19-21)

''ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నియు చేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది. ధర్మశాస్త్రముచేత ఎవడును దేవునియెదుట నీతిమంతుడని తీర్చబడడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాససంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటివలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను; ఇందునుగూర్చి మ్రానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.'' (గలతీయులకు 3:10-14)

''మనము పాపముల విషయమై చనిపోయి, నీతివిషయమై జీవించునట్లు, ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రానుమీద మోసికొనెను. ఆయన పొందిన గాయములచేత మీరు స్వస్థత నొందితిరి.'' (1పేతురు 2:24)

''ఏలయనగా మనలను దేవునియొద్దకు తెచ్చుటకు, అనీతిమంతులకొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరవిషయములో చంపబడియు, ఆత్మవిషయములో బ్రదికింపబడి, పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను.” (1 పేతురు 3:18)

మొదటి ప్రశ్నకు ఇచ్చిన జవాబులో మనము చూసిన విధముగా, పాప ఫలితముగా దేవునితో నున్న అన్యోన్య సహవాసము పోయి శరీరమరణము వచ్చినది. శరీరమరణము అనగా ప్రాణము లేక ఆత్మ దేహము నుండి వెడలిపోయి, దేహము ఏ నేల నుండి తీయబడినదో ఆ నేలలోనే తిరిగి కలిసిపోవుట. దేవుని యొక్క ధర్మశాస్త్రము కోరిన దానిని చేయలేకపోయారు గనుక, పాపులపైన వారి యొక్క తిరుగుబాటు దుష్టత్వము ఫలితముగా దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడింది. (ఆదికాండము 2:17, 3:19; యెషయా 59:1-2; కీర్తన 66:18; హబక్కూకు 1:13; రోమా 1:18-32 చూడండి)

యేసు ప్రభువు వేసిన కేక మరియు మధ్యాహ్నపు వేళ భూమిపైన కమ్మిన చీకటి, మన స్థానములో క్రీస్తును దేవుడు శిక్షించాడని, దేవుని యొక్క ప్రేమ గల అన్యోన్య సహవాసమును యేసు పోగొట్టుకొన్నారని మనకు తెలియచేయుచున్నవి:

''మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు మూడుగంటలప్పుడు యేసు -  ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము.'' (మత్తయి 27:45-46)

దీనిని క్రింద ఇవ్వబడిన పాత నిబంధన వాక్యములతో పోల్చి చూడండి:

''అందుకు యెహోవా మోషేతో -  ఆకాశమువైపు నీ చెయ్యి చాపుము. ఐగుప్తు దేశము మీద చీకటి, చేతికి తెలియునంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశము వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు మూడు దినములు గాఢాంధకారమాయెను. మూడు దినములు ఒకనినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటనుండి లేవలేకపోయెను; అయినను ఇశ్రాయేలీయులకందరికి వారి నివాసములలో వెలుగుండెను.'' (నిర్గమకాండము 10:21-23)

''ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా - ఆ దినమున నేను మధ్యాహ్నకాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. పగటివేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములను దుఃఖదినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదును, అందరిని మొలలమీద గోనెపట్ట కట్టుకొనజేయుదును, అందరి తలలు బోడిచేసెదను, ఒకనికి కలుగు ఏకపుత్రశోకము వంటి ప్రలాపము నేను పుట్టింతును; దాని అంత్యదినము (అంతము) ఘోరమైన శ్రమదినముగా ఉండును.'' (ఆమోసు 8:9-10)

క్రీస్తు పాపులకు ప్రత్యామ్నాయముగా దేవుని ప్రజలకొరకు చనిపోవడానికి వచ్చారు కాబట్టి, పాపులందరు పొందవలసిన న్యాయమైన శిక్షను తాను అనుభవించారు.

నాలుగవదిగా, యేసు మన పక్షముగా తండ్రి ఎదుట తనను తాను బలిగా సమర్పించి, మనకొరకు యాచనలను చేయుచున్న విశ్వాసుల ప్రధానయాజకుడని లేఖనములు తెలియజేయుచున్నాయి.

''ఇందువలన, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి.'' (హెబ్రీయులకు 3:1)

''మన ప్రభువు యూదా సంతానమందు జన్మించెననుట స్పష్టమే; ఆ గోత్రవిషయములో యాజకులను గూర్చి మోషే యేమియు చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనములేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి, మెల్కీసెదెకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చియున్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమైయున్నది. ఏలయనగా -  నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను.'' (హెబ్రీయులకు 7:14-17)

''ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైయున్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నావాడును, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని, ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణసిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధాన యాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజలపాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరముగలవాడు కాడు; తన్ను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించెను.'' (హెబ్రీయులకు 7:24-28)

ఈ అంశమునకు సంబంధించి, యేసు ప్రభువు పగలు మూడు గడియలకు (ఉదయం తొమ్మిది గంటలకు) సిలువ వేయబడి, తనను సిలువ వేసి తన వస్త్రములు పంచుకుంటున్నవారి పక్షమున ప్రార్థన చేసిరని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది.

''ఆయనను సిలువవేసినప్పుడు పగలు తొమ్మిది గంటలాయెను.'' (మార్కు 15:25)

''వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడా సిలువవేసిరి. యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లువేసిరి.'' (లూకా 23:33-34)

పగలు తొమ్మిది గడియలకు (మధ్యాహ్నం మూడు గంటలకు) క్రీస్తు తండ్రికి కేక వేశారు. ఇంతకు మించి ఇంకేం కావాలి?:-

''మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; ఆ మాటలకు నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము." (మార్కు 15:34)

దేవాలయములో ఆరాధన చేయువారు గానం చేయుటకు ప్రత్యేకపరచిన కీర్తనలలో భాగమైన 22వ కీర్తనలోని ఆరంభ మాటలనే ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చట ఉపయోగించడం జరిగింది.

"నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?''  కీర్తనలు 22:1

యేసు క్రీస్తు ప్రభువు ఈ ప్రత్యేక కీర్తనలోని మాటలనే ఒక ప్రార్థనగా చేశారని ఇక్కడ తెలుస్తున్నది. ఆశ్చర్యమేమిటంటే, ఉదయం తొమ్మిది గంటలకు (ఆయనను శిలువ వేసిన సమయం) మరియు మధ్యాహ్నం మూడు గంటలకు (ఆయన కేక వేసిన సమయం)  దేవాలయములో సరిగ్గా ప్రార్థనలు మరియు అనుదిన బలులు అర్పించే సమయం!

"పెంతెకొస్తను పండుగదినము వచ్చినప్పుడు అందరు ఒకచోట కూడియుండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలివంటి యొకధ్వని  ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కుర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతిజనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి..... అయితే పేతురు ఆ పదునొకరితో కూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను - యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్తజనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నామాటలు వినుడి. మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామయిన కాలేదు." (అపొస్తలుల కార్యములు 2:1-5,14-15)

(ఇక్కడ ప్రొద్దుపొడిచి జామయిన కాలేదు, అనగా ప్రొద్దుపొడిచి మూడు గడియలు లేక ఉదయం తొమ్మిది గంటలు కూడా కాలేదు అని అర్థం. ఒక జామునకు మూడు గంటలు లేక మూడు గడియలు.)

ప్రొద్దుపొడిచి జామయిన (ఉదయం తొమ్మిది గంటలు కూడా) కాలేదు అని పేతురు చెప్పిన మాట ఎంతటి  భావగర్భితమైనదో మనము ఇప్పుడు చూద్దాం.

"పగలు (అనగా మధ్యాహ్నం) మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా," (అపొస్తలుల కార్యములు 3:1)

"పగలు (అనగా మధ్యాహ్నం) ఇంచుమించు మూడు గంటలవేళ దేవుని దూత అతనియొద్దకు వచ్చి - కొర్నేలీ, అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను ... అందుకు కొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు (అనగా మధ్యాహ్నం) మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి....." (అపొస్తలుల కార్యములు 10:3,30)

బైబిలు వ్యాఖ్యానకర్త, జాన్ గిల్, మత్తయి 27:46, మార్కు15:25 మరియు అపొస్తలుల కార్యములు 2:14-15 ల పైన చేసిన వ్యాఖ్యానము ఇక్కడ ఇస్తున్నాం:-

తొమ్మిది గడియలు లేక మధ్యాహ్నము మూడు గంటల గురించి...
సరిగ్గా ఇది క్రీస్తుకు దృష్టాంతముగా ఉన్న అనుదిన బలులను వధించి అర్పణలను అర్పించే సమయం; దీని గురించి యూదులు చెప్పునదేమనగా (F9),

"ప్రతిరోజు ఎనిమిదిన్నర గడియలకు (అనగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు)  అనుదిన బలి వధించబడి, తొమ్మిదిన్నర గడియలకు (అనగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు) అర్పింపబడుతుంది."

 క్రీస్తుకు మరో దృష్టాంతమైన పస్కా బలిపశువు కూడా అదే సమయంలో వధించబడుతుంది; "మొదట దానిని అర్పించిన తరువాతనే అనుదిన బలి అర్పించబడుతుంది" అని యూదులు చెబుతారు (F11). ఐతే మరియొక చోట (F12)  దీనిని గురించి ఇలా వ్రాయబడియున్నది:-

"(సంవత్సరములోని అన్ని సామాన్య దినములలో) అనుదినబలి పగలు ఎనిమిదిన్నర గడియలకు (అనగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు) వధించబడి, తొమ్మిదిన్నర గడియలకు (అనగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు) అర్పింపబడుతుంది; పస్కా సాయంత్రపండుగ జరుపుకోబోయో దినమందు మాత్రం (అది సామాన్య దినమైనా లేక సబ్బాతు దినమైనా) ఏడున్నర గడియలకు(అనగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) వధించబడి, ఎనిమిదిన్నర గడియలకు (అనగా మధ్యాహ్నం రెండున్నర గంటలకు) అర్పింపబడుతుంది: కానీ ఒకవేళ పస్కా(ప్రారంభమయ్యే) సాయంత్రం కూడా సబ్బాతు (ప్రారంభమయ్యే) సాయంత్రముననే ప్రారంభమైతే, ఆ దినమందు మాత్రం అది ఆరున్నర గడియలకు (అనగా మధ్యాహ్నం పండ్రెండున్నర గంటలకు) వధించబడి, ఏడున్నర గడియలకు (అనగా మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు) అర్పింపబడుతుంది, ఆ తరువాతనే పస్కా బలి జరుగుతుంది."...

FOOTNOTES:
F9 T. Hieros. Pesachim, fol. 31. 3, 4.
F11 lb.
F12 Misn. Pesachim, c. 5. sect. 1.

పగలు తొమ్మిది గంటలకు ఆయనను సిలువ వేసిరి...
అనుదిన ఉదయకాలపు బలిసమయమున, యాజకులందరు కూడుకొనవలెను; మరియు అది ఆ గొప్ప సన్హెద్రు మహాసభ వారందరు సభలో కూడుకొను సమయము; (F24),

"అనుదినము ఉదయకాలపు బలిసమయము మొదలుకొని సాయంకాలపు బలిసమయము వరకు ఆ గొప్ప సన్హెద్రు మహాసభ వారు కూడుకొని యుంటారు;"

FOOTNOTES:
F24 Maimon. Hilch. Sanhedrin, c. 3, sect. 1.

అంతేకాకుండా, యూదులు ఈ సమయము వరకు దేనినైనా తినే లేక రుచించే వాడుక వారికి లేదు: దాని గురించిన వారి నిబంధనలు ఇవి, (F8)

"ఏ మనుష్యుడు కూడా ప్రొద్దుపొడిచిన తరువాత ఉదయ కాలపు ప్రార్థన చేసి ముగించేంత వరకు ఏమియు రుచించకూడదు కనీసం ఏ పనీ చేయకూడదు."

ఇంకా,

"ఉదయ కాలపు ప్రార్థనకు ఉన్న కట్టడేమనగా, సూర్యుడు ఉదయించగానే ఆ మనిషి ప్రార్థించుట ప్రారంభించాలి; దీని వ్యవధి నాలుగవ గడియ చివరివరకు (అనగా ఉదయం పది గంటల వరకు), అది ఒక దినపు పగటి కాలములో మూడవ భాగమగును (F9)."

ఆ విధముగా ఆహారమునైనా లేక పానీయమునైనా నాలుగవ గడియ వరకు, అనగా ఉదయం పది గంటల వరకు రుచించకూడదు: కావున దానిగూర్చి (F11) ఇలా చెప్పబడింది :-

"అనుదిన బలిని వారు అర్పించిన తరువాత, నాలుగు గంటలు (బజ్మన్ అర్బఅ షఅయిన్ - בזמן ארבע שעין) లేక నాలుగు గడియల సమయము తర్వాత (అంటే ఉదయం పది గంటలకు) రొట్టెను తింటారు."

నాలుగవ గడియలో (అంటే ఉదయం పది గంటలకు) గానీ అంతకు ముందు గానీ, కనీసము కొంచెము కూడా తినకూడదు; ఎవరైతే తింటారో అతనితో ఎవరైనా మాట్లాడుటకు అతడు ఎంతమాత్రమూ అర్హుడు కాడు.

"రబ్బి ఐజాక్ చెప్పినదేమనగా (F12), నాలుగు గడియల కంటే ముందు ఎవరైనా పచ్చని ఆకు లేక కూర మొక్క తింటే అతనితో మాట్లాడటం నిషిద్ధము; అతను ఇంకా చెప్పినదేమనగా, నాలుగవ గడియకు ముందు పచ్చికూరమొక్కను కూడా తినకూడదు. అమేమర్, మార్ జుత్ర, మరియు రబ్ అషే కూర్చునియుండగా, నాలుగవ గడియకు (అంటే ఉదయం పది గంటలకు) ముందు వారియొద్దకు పచ్చికూర మొక్కను ఒకదాన్ని తినుటకై తీసుకువచ్చారు. అమేమర్ మరియు రబ్ అషే తిన్నారు, కానీ మార్ జుత్ర తినలేదు: నీ భావమేమి? అని వారు అతడిని అడుగగా, అతడు రబ్బి ఐజాక్ గారు ఇలా చెప్పారని బదులిచ్చాడు - ‘నాలుగవ గడియకంటే ముందు ఎవరైతే కూరమొక్కను తింటారో, వారితో మాట్లాడుట నిషిద్ధము.’"

 వేరువేరు గుణములు గలిగిన వ్యక్తులు భోజనము చేసే సమయములను గురించి వారు ఈలాగున తెలియజేశారు:

"భోజనము చేయు ఘడియలేవనగా :- లూదీయులకు మొదటి గడియ, దొంగలకు రెండవ గడియ, వారసులకు మూడవ గడియ, కూలివారికు నాలుగవ గడియ, ఐదవ గడియ ప్రతి మనిషికి; అది వాస్తవం కాదా? రబ్బి పాప దానిని గూర్చి ఇలా చెప్పారు, నాలుగవది ప్రతి ఒక్కరు భోజనము చేయు సమయం; కానీ, (వాస్తవమేమనగా) నాలుగవది ప్రతి ఒక్కరూ తినే సమయం, కూలివారికి ఐదవది, మరియు జ్ఞానుల శిష్యులకు ఆరవ గడియ తినే సమయం. (F13)"

కావున ఈ ఉపదేశమివ్వబడినది (F14),

" ‘నాలుగవ గడియలో’ భోజనశాలకు (సత్రముకు) పోయి మద్యము త్రాగుతున్నవాడినేగానీ, గిన్నెను తన చేతితో పట్టుకొని తూలుచున్నవానినే గానీ చూచిన యెడల అతడు బుద్ధి గల బోధకుడేమో అని అతని గురించి విచారించుము..."

దీని మీదనున్న ‘వ్యాఖ్యానము’ ఏమంటే-

"నాలుగవ గడియ అందరికి తినే సమయము, అప్పుడు అందరూ భోజనశాలకు (లేక సత్రమునకు) తినడానికి వెళతారు."

కాబట్టి ఎవరైనా త్రాగి మత్తులై యుంటే వారు రాత్రియందే త్రాగి మత్తులైయుంటారుగాని పగలు కాదు, అందులోనూ మరీ అంత ప్రొద్దుననే త్రాగరు, భక్తి గలిగిన ఒక వ్యక్తి ఆ సమయంలో కనీసం దేనినైనా రుచించుట వాడుక కాదు; అపొస్తలులు వారితోనున్న వారు స్థిరబుద్ధి గలవారును భక్తి గలవారును కాబట్టి వారి గుణమును చెరుపుదానిని ఎన్నడూ చేయరు, ఇటువంటిది మరి ఏదైనా వారిలో ఉందని ఎంచటం అవివేకము.            

FOOTNOTES:
F8 Maimon. Hilch, Tophilla, c. 6. sect. 4. T. Bab. Beracot, fol. 28. 2.
F9 lb. c. 3. sect. 1. Vid. T. Beracot, fol. 26. 2.
F11 Targum in Eccl. x. 17.
F12 T. Bab. Betacot, fol. 44. 2.
F13 T. Bab. Sabbat, fol. 10. 1.
F14 T. Bab. Bava Metzia, fol. 83. 2.

ఉదయసాయంత్రములయందు బలులనర్పిస్తూ ప్రార్థనలు చేసే అలవాటును ఇలా  పాటించాలని, దేవాలయమును నిలువబెట్టినప్పటి నుండి రాజైన దావీదు చేత నియమించబడినది.

"వీరు తమ పితరుల యింటివారినిబట్టి లేవీయులుగా ఎంచబడిరి; పితరుల యిండ్లకు పెద్దలైన వీరు ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారై తమ తమ పేరుల లెక్కప్రకారము ఒక్కొక్కరుగా నెంచబడి యెహోవా మందిరపు సేవచేయు పనివారైయుండిరి. ఇశ్రాయేలీ యుల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసియున్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు లేవీయులుకూడ ఇకమీదట గుడారమునైనను దాని సేవకొరకైన ఉపకరణ ములనైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి యాజ్ఞనుబట్టి లేవీయులలో ఇరువది సంవత్సరములు మొదలుకొని అంతకు పైవయస్సుగలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతివారి చేతిక్రింద పని చూచుటకును, వారి వశముననున్న యెహోవా మందిర సేవకొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠితవస్తువులను శుద్ధిచేయుటకును, దేవుని మందిర సేవకొరకైన పనిని విచారించుటకును, సన్నిధి రొట్టెను నైవేద్యమునకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కాల్చు దానిని పేల్చుదానిని నానావిధమైన పరిమాణములు గలవాటిని కొలతగలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాల ములయందు యెహోవానుగూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతిదినములలోను, అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను, లెక్కకు సరియైనవారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకును నియమింపబడిరి." 1దినవృత్తాంతములు 23:24-30
నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును, ఉదయ సాయంకాలముల యందును, విశ్రాంతి దినములయందును, అమావాస్యల యందును, మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవములయందును, ఇశ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహనబలులను అర్పించుటకును, ఆయన నామఘనతకొరకు మందిరమొకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడునట్లుగా నేను కట్టించబోవుచున్నాను.” 2 దినవృత్తాంతములు 2:4
“వారు ఉదయాస్తమయములయందు యెహోవాకు దహనబలులు అర్పించుచు, సుగంధద్రవ్యములతో ధూపము వేయుచు, పవిత్రమైన బల్లమీద సన్నిధిరొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభమును ప్రమిదెలను ప్రతి సాయంత్రము ముట్టించుచు వచ్చుచున్నారు; మేము మా దేవుడైన యెహోవా యేర్పర చిన విధినిబట్టి సమస్తము జరిగించుచున్నాము గాని మీరు ఆయనను విసర్జించిన వారైతిరి
.” 2 దినవృత్తాంతములు 13:11

కాబట్టి,  దేవాలయములో యూదులు ప్రార్థనలు చేసే అదే గడియలలో, సరిగ్గా బలులను అర్పించే ఆ సమయములోనే మన ప్రధానయాజకుడును, ప్రభువును అయిన యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేయటము మరియు తన ప్రాణమర్పించటము కాకతాళీయముగా జరిగిన సంభవమేమీ కాదు.



ముస్లింలకు ప్రశ్న:-

అల్లాహ్ ప్రార్థన చేశాడని ఖురాన్ చెప్పుచున్నది, మరి అల్లాహ్ ఎవరికి ప్రార్థన చేస్తున్నాట్టు?

"వారిపైన అల్లాహ్ యొక్క ప్రార్థనలు (సలవతున్) మరియు కరుణ ఉంటాయి, మరియు వారే సరియైన దారిచూపబడినవారు." సురా 2:157 (అరబీ నుండి తెలుగు)

"మీ మీద ప్రార్థనలు అవతరింప చేయువాడు ఆయనే (యుసల్లీ అలయ్ కుం), ఆ ప్రకారమే ఆయన దూతలు కూడ..." సూరా 33:43 (అరబీ నుండి తెలుగు)

"అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త కొరకు ప్రార్థించారు (యుసల్లూన అల అన్నబియ్యి): ఓ విశ్వాసులారా అతనికొరకు ప్రార్థించండి (సల్లూ అలయ్ హి), మరియు గౌరవముతో అతనికి వందనము చేయండి." సూరా 33:56 (అరబీ నుండి తెలుగు)

విశ్వాసుల కొరకు ముహమ్మద్ ప్రార్థన చేసినట్లుగా, అల్లాహ్ విశ్వాసుల కొరకు మరియు ముహమ్మద్ కొరకు ప్రార్థన చేశాడు:

"వారి సంపదలోనుండి తిరిపెము (దానం) తీసుకో, దానితో నీవు వారిని శుద్ధిచేయవచ్చును మరియు వృద్ధిపరచవచ్చును, మరియు వారికొరకు ప్రార్థన చేయి (వ సల్లి అలయ్ హిం). ఇదిగో! నీ ప్రార్థనవల్ల (సలాత క)  వారికి ఉపశమనం కలుగుతుంది. అల్లాహ్ వినేవాడు, అన్నీ తెలిసినవాడు." సూరా 9:103 (అరబీ నుండి తెలుగు)

 అల్లాహ్ అక్షరాలా ప్రార్థన చేశాడని ఈ వచనాలన్నీ సుస్పష్టముగా చెప్పుచున్నవి, మరియు, చేసే ప్రార్థనను వినేవాడు ఒకడు కావాలి గనుక, మేము అడిగేది ఏమంటే అల్లాహ్ ఎవరికి ప్రార్థన చేశాడు? అల్లాహ్ అద్వితీయుడు అని ముస్లింలు వాదిస్తారు, అంటే ఆయన వ్యక్తిత్వములో బహుళత్వము లేదు. కాబట్టి, అల్లాహ్ తనకు తాను ప్రార్థన చేసికొంటూ ఉండే అవకాశమే లేదు. అట్లైతే ఈ ప్రార్థనలన్నీ అల్లాహ్ ఎవరికి చేసినట్టు? ముస్లింల వాదనల ప్రకారం పై వచనాలను విశ్లేషిస్తే ఒకవేళ అల్లాహ్ తనకు తానే ప్రార్థించుకున్నాడేమో అని ఖచ్చితముగా అనిపిస్తున్నది.

కొంతమంది ముస్లింలు ఇక్కడ ప్రార్థన అంటే అక్షరార్థముగా ప్రార్థన అని అర్థము కాదు కాని, అరబీ భాషలో  ‘సలాహ్’ అని వ్రాయబడిన పదానికి ఆశీర్వాదము అని అర్థం చెప్తూ, అల్లాహ్ ఆశీర్వాదములు పంపుతున్నాడు అనే అర్థం తీసుకు వస్తుంటారు, అక్కడున్న పదాలను వారికి అనుకూలముగా తిరిగి నిర్వచించడానికి ప్రయత్నిస్తుంటారు. వారు ఇస్తున్న ఈ వివరణలో ఉన్న సమస్య ఏమిటంటే, “ఆశీర్వాదము” అని చెప్పుటకు అరబీ భాషలో ‘బరక’ అనే పదము వాడబడాలి, కాని అది పైన చెప్పబడిన ఉదాహరణలలో ఎక్కడా కనిపించదు. అందుకు విరుద్ధంగా ‘సలాహ్’ అనే పదమునుండి ఉద్భవించిన సలావతున్, యుసల్లీ,  యుసల్లూన, మరియు సల్లూ అనే పదాలనే ఖురాన్లో ప్రయోగించడం జరిగింది.

"అండర్స్టాండింగ్ ఇస్లాం" అనే గ్రంథ రచయితయైన మోఇజ్ అంజాద్ అను ముస్లిం రచయిత ఈ ప్రశ్నకు జవాబుగా ‘సలాహ్’ యొక్క నిఘంటు అర్థము ఇచ్చాడు:

ఇబ్న్ అల్-అతీర్ అనునతడు 'అల్-నిహాయహ్ ఫీ గరీబ్ అల్-అతర్' అను తన ప్రసిద్ధమైన అరబి భాష నిఘంటువులో "సలాహ్" అను పదమునకు అర్థమును ఈ విధముగా వివరించాడు:

'అల్-సలాహ్' మరియు 'అల్-సలవాత్': ఈ పదం ఒక విశేషమైన (ప్రత్యేకమైన) ఆరాధనకు ఉపయోగించబడుతుంది. అక్షరార్థముగా ఈ పదమునకున్న మూలార్థము విజ్ఞాపన (ప్రార్థన). కొన్నిసార్లు, దీనిలోని ఒకటి లేక అంతకంటే ఎక్కువ భాగాలను ఉపయోగిస్తూ 'సలాహ్' అనే ఈ పదం వాడబడుతూ ఉంటుంది. అక్షరార్థముగా ఈ పదము యొక్క మూలార్థము 'మహిమపరచుట' అని కూడా చెప్పబడుతుంది. మరియు విశేషమైన (ప్రత్యేకమైన) ఆరాధనను 'సలాహ్' అని పిలుస్తారు, ఎందుకనగా ఇది ప్రభువుకు మహిమను కలుగజేస్తుంది.

ఇక్కడ ‘సలాహ్’ అనే ఈ పదమునకు సంబంధించిన వివరణను ప్రశ్నోత్తర రూపంలో ఇంకా వివరంగా చూద్దాం.

ప్రశ్న:
"సలాహ్" అను పదమునకున్న సరైన అర్థము ఏమిటి? “ప్రార్థన” అను పదము “సలాహ్” అను పదమునకు దగ్గరగా ఉన్న సమానార్థ పదము కాదట; నిజమేనా?
జవాబు:
సలహ్ (صلاة) యొక్క అక్షరార్థమైన అర్థము ఏమంటే ఒకని దేవునికి ఒకడు పెట్టు మొఱ్ఱ (వినయపూర్వకముగా మరియు గౌరవసహితముగా). ఇది ‘దుఆ’ (دعا) అనే పదము లాంటిదే. (దుఆ అనగా ప్రార్థన అని అర్థము)


ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో మనము ‘ప్రార్థన’ (ప్రేయర్) అనే పదమునకున్న అర్థమును ఈ విధముగా చదువుతాం:

"ప్రార్థన (ప్రేయర్): ఈ పదమునకున్న అర్థమేమనగా - సహాయము కొరకైన అభ్యర్థన లేక నిజదేవునికిగాని, మరేదైనా ఇతర దైవమునకుగాని కృతజ్ఞతలు తెలియజేయుట".

పైన చెప్పబడినది సలాహ్ అనే పదానికి యుక్తమైన మరియు అక్షరార్థమైన అనువాదార్థము అని నా అభిప్రాయము. ఐతే ఎవరైనా - సహాయము కొరకైన అభ్యర్థన చేయడానికి లేక కృతజ్ఞతలు తెలపడానికి మాత్రమే ‘సలాహ్’ అనే ఈ పదము వాడబడుటలేదు కాని, దేవుని స్వరూపలక్షణాలను వర్ణించుటకు, దేవుని మహిమ పరచుటకు....... ఇత్యాది సందర్భాలలో కూడా ఈ పదము వాడబడుచున్నది కదా అని వాదించవచ్చును.

ప్రసిద్ధమైన ముస్లిం వ్యాఖ్యానకర్త, ఇబ్న్ కతీర్, ఆ పదాన్ని ఈ విధముగా నిర్వచించాడు:

సలాహ్ యొక్క అర్థము:
అరబి భాషలో, ‘సలాహ్’ యొక్క ప్రాథమికమైన అర్థము ‘విజ్ఞాపన’. మతసంబంధమైన పరిభాషలో, తలవంచుట మరియు సాష్టాంగనమస్కారము చేయుట వంటి కార్యములను సూచించుటకు, తత్సంబంధ క్రియలకు, ఆయా సమయాలలో లేక అవసరతలలో కూడా వాడబడుతుంది.

స్వయాన ముహమ్మదు యొక్క పినతండ్రి  కుమారుడు మరియు పేరుగాంచిన ముస్లిం పండితుడు, ఇబ్న్ అబ్బాస్, అల్లాహ్ ప్రార్థన చేశాడని అంగీకరించాడు:

"ఇశ్రాయేలు ప్రజలు మోషేతో ఇలా అన్నారు: నీ ప్రభువు ప్రార్థన చేస్తాడా? అతని ప్రభువు  అతని పిలిచి :- ‘ఓ మోషే, వారు నీ ప్రభువు ప్రార్థన చేస్తాడా’? అని నిన్ను అడిగారు. (వారితో) ఇలా చెప్పు - 'అవును, నా ప్రవక్తల కొరకు మరియు నా వార్తావహుల కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా దూతలు కూడా ప్రార్థన చేస్తారు', అప్పుడు అల్లాహ్ తన వార్తావహుని  మీదకు దానిని పంపాడు. ‘అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రార్థిస్తారు...'" [ఇబ్న్ కతీర్చే సూరా అల్-అహ్జాబ్ 33:56లో ఉటంకించబడినది.]

ఇబ్న్ హిషామ్ వ్రాసిన అల్ - సీరహ్ అల్ - హలబియ్య  అను గ్రంథమునుండి, అల్లాహ్ చేసిన ప్రార్థన యొక్క అనువాదమును ఉటంకించుచున్నాము:

قلت يا جبريل أيصلى ربك قال نعم قلت وما يقول قال يقول سبوح قدوس رب الملائكة والروح سبقت رحمتى غضبى

"ఓ గబ్రియేలూ, నీ దేవుడు ప్రార్థన చేస్తాడా?" అని నేను [ముహమ్మద్] అన్నాను. అందుకు అతడు "అవును" అన్నాడు. "ఏమని ప్రార్థన చేస్తాడు?" అని అడిగాను. ఆయన అప్పుడు ఈ విధంగా అన్నాడు - ‘దూతలకును ఆత్మకును ప్రభువైనవాడు పరిశుద్ధుడు, మహిమగలవాడు. నా దయ నా ఉగ్రతను అధిగమించును’ అని ఆయన (ప్రభువు) అంటాడు."

సూరా 33:56 గూర్చి మరియు అల్లాహ్ ప్రార్థన చేయుటను గురించి వేరొక ముస్లిం వ్యాఖ్యాన కర్త ఈ విధముగా వ్యాఖ్యానించాడు:

అల్లాహ్ మొదటగా తన మీదకు అశీర్వాదమును వేడుకొనుట ద్వారా, తరువాత దూతలయొక్క ప్రార్థన ద్వారా, అటుతరువాత అదేవిధముగా తన దాసులను ఆయన మీదకు ఆశీర్వాదము మరియు సమాధానమును వేడుకొనమని అజ్ఞాపించుటద్వారా తన ప్రవక్త యొక్క యోగ్యతను స్పష్టము చేస్తాడు. అబు బక్ర్ ఇబ్న్ ఫురాక్ తెలియచెప్పినదేమనగా 'ఉలమా'లో (అనగా మత పెద్దలలో) ఒకడు ప్రవక్త మాటలను ఇలా వివరించాడు, "నా కంటి చల్లదనము ప్రార్థనలో ఉంది". ఇక్కడ ప్రార్థన అనగా అల్లాహ్ చేసే ప్రార్థన, మరియు అల్లాహ్ ఆజ్ఞకు లోబడి పునరుత్థాన దినం వరకు ఆయన సమాజము వారు చేయు ప్రార్థన. దూతలు మరియు మనుష్యులు చేసేటి ప్రార్థనలో అతని కొరకు వారందరు చేసే విజ్ఞాపనము ఉంటుంది, కాని అల్లాహ్ చేసే ప్రార్థనలో దయ ఉంటుంది.

"వారు ప్రార్థించారు" అన్నప్పుడు, వారు ఆశీర్వాదమును (బరక) వేడుకొంటున్నారు అని అర్థము చెప్పబడుతుంది. కానీ,  తనకొరకు ప్రార్థన చేయమని ప్రవక్త ప్రజలకు చెప్పినప్పుడు, ‘సలాతు’(ప్రార్థన)కు మరియు ‘బరాక’(ఆశీర్వాదము)కు మధ్య ఉన్న వ్యత్యాసమును స్పష్టముగా ప్రవక్త తెలియజేశాడు. అతని కొరకు చేయబడిన ప్రార్థనకు గల అర్థమును తరువాత గమనిద్దాము. (ముహమ్మద్ మెసెంజర్ ఆఫ్ అల్లాహ్ (అష్-షిఫా ఆఫ్ కాది 'ఇయాద్), కాది 'ఇయాద్ మూసా అల్-యహ్సుబి,  ఇంగ్లీషు అనువాదం ఆయిషా అబ్ద్అర్రహమాన్ బెవ్లీ [మదీనా ప్రెస్, ఇన్వెర్నెస్స్, స్కాట్లాండ్, యు.కె. 1991; తృతీయ ముద్రణ], 25వ పేజీ)

అంతేకాకుండా:-

తన కొరకు ప్రార్థన చేసే విషయమును గురించి హదీసుల్లో ప్రవక్త ప్రస్తావిస్తూ, సలాతు (ప్రార్థన) మరియు బరక (ఆశీర్వాదము) మధ్యనున్న వ్యత్యాసమును తెలియజేశాడు. ఆ రెండు పదాలకు వేర్వేరు అర్థాలు ఉన్నాయని అక్కడ స్పష్టముగా తెలియవస్తున్నది. (పైన ఉదహరింపబడిన పుస్తకములో., 250వ పేజీ)

మరలా:-

సలమ అల్-కింది ఇలా చెప్పాడు: ప్రవక్త కొరకు చేయవలసిన ప్రార్థనను అలీ ఈ క్రింది విధముగా బోధిస్తూ ఉండేవాడు: "నింగిని బల్లపరుపుగా పరచి, ఆకాశములను సృజించిన ఓ అల్లాహ్! నీ గొప్ప ప్రార్థనలను, అత్యధికమగు నీ ఆశీర్వాదమును మరియు నీ దయా కటక్షములను ముహమ్మదు పైన అనుగ్రహించు... "
"అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తపై ప్రార్థిస్తారు"(33:56) అనే వచనములో ముహమ్మదుపై చేయు ప్రార్థన గురించి అలీ ఈ విధముగా అర్థము చెప్పాడు :- "నా ప్రభువా నీ సేవలో మరియు విధేయతలో ఉన్నాము. అల్లాహ్ యొక్క ప్రార్థనలు, మంచితనముతో దయ చూపేవారి ప్రార్థనలు, ఆయనకు సమీపముగా ఉండే దూతల ప్రార్థనలు, సత్యవర్తనుల ప్రార్థనలు, హతసాక్షుల ప్రార్థనలు, సాలిహున్ యొక్క ప్రార్థనలు, నిన్ను మహిమపరచునది మరియేదైనాగాని ఉంటే దాని ప్రార్థనలు, ప్రపంచములకు ప్రభువైనవాడా, ముహమ్మదు ఇబ్న్అబ్దుల్లాహ్ పైన ఉండుగాక... " (పైన ఉదహరింపబడిన పుస్తకములో, 257వ పేజీ)

చాలా ఆసక్తిని రేకెత్తించే మరో మాట:

ఇబ్న్ మసూద్ ఇలా చెప్పుచూ ఉండేవాడు, "నీవు ముహమ్మదు ప్రవక్తను ఆశీర్వదించినప్పుడు, ఆయన మీద శ్రేష్ఠమైన ప్రార్థనను కూడా చేయి. ఒకవేళ అది అతనికి చూపబడుతుందేమో నీకు తెలియదు కదా! అందుచేత ఇలా అను :- 'ఓ అల్లాహ్, నీ ప్రార్థనలు, నీ దయ మరియు నీ ఆశీర్వాదము వార్తావహుల నాయకుడిపైన, దైవభయము గలవారి ఇమాము (నాయకుడు) పైన, మంచివారి నాయకుడి పైన మరియు కరుణ గలిగిన వార్తావహుని మీద అనుగ్రహించు.'"(పైన ఉదహరింపబడిన పుస్తకములో, 258వ పేజీ)

పైన చూపిన ఇబ్న్ మసూద్ హదీసులో, అల్లాహ్ చేసిన ప్రార్థనలకు, అతని దయ మరియు ఆశీర్వాదములకు మధ్య  సుస్పష్టముగా వ్యత్యాసము కనిపిస్తున్నది. కావున ప్రార్థనకై వాడబడిన పదములో ఆశీర్వాదము అనే అర్థము లేనే లేదు అని తెలుపకనే తెలుస్తున్నది.

చివరిగా:-

అనస్ ఇబ్న్ మాలిక్ ప్రవక్త ఇలా అనినట్లుగా చెప్పుచున్నాడు, "ఎవరైనా నన్ను ఒక్కసారి ఆశీర్వదిస్తే, అతనిని అల్లాహ్ పది ప్రార్థనలతో ఆశీర్వదిస్తాడు... "
అనస్ ఇబ్న్ మాలిక్ ప్రవక్త ఇలా అనినట్లుగా కూడా చెప్పుచున్నాడు, "జిబ్రిల్ నన్ను పిలిచి ఇలా అన్నాడు, ‘ఎవరైతే నీ మీద ఒక్కసారి ప్రార్థనను చేస్తారో, అతని పైన అల్లాహ్ పదిసార్లు ప్రార్థన చేస్తాడు మరియు పది మెట్లు పైకి లేపుతాడు,’"...  (పైన ఉదహరింపబడిన పుస్తకములో, 259వ పేజీ)

ఇస్లాం వాస్తవముగా బోధిస్తున్న దానిని ముస్లింలు కప్పిపుచ్చకుండా ఉంటే, అల్లాహ్ ప్రార్థన చేశాడు అనటానికి వారికి ఎటువంటి భయము కలుగదు. ఉదాహరణకు- సున్నీ ముస్లిం రచయిత జి.ఎఫ్. హద్దద్ సురా 33:56ను ఏ విధముగా అనువదించాడో గమనించండి:

విశ్వాసము యొక్క పరిపూర్ణత ప్రవక్త పట్ల ఉండే ప్రేమ పైన ఆధారపడి ఉంది, ఎందుకంటే అల్లాహ్ మరియు ఆయన దూతలు తరచుగా ప్రవక్త యొక్క గౌరవమును పైకెత్తుచున్నారు. దానిని ఈ క్రింది వచనములో చూడగలము:
"అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త మీద ప్రార్థనలు చేయుచున్నారు" (33:56)...

2. అల్లాహ్ ఇలా అన్నాడు : ప్రవక్త మీద ఆశీర్వాదములు వేడుకొనండి.
ప్రవక్త మీద ప్రార్థన చేయడానికి మరియు ఆయనను పొగడడానికి మనము ప్రోత్సాహపరచబడుచున్నాము; అది అల్లాహ్ ఆజ్ఞ ద్వారా మనకు ఇవ్వబడిన నియమము అని ఈ క్రింది వచనము చెప్పుచున్నది:
"అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్తను పొగడుచు ఆయన మీద ప్రార్థన చేస్తున్నారు; ఓ విశ్వాసులారా! మీరును ఆయనను పొగడి ఆయన మీద ప్రార్థన చేయండి మరియు అత్యంత శుభవచనములు పంపించండి."(అల్-అహ్జాబ్ 56)... (లవ్ ఆఫ్ ద ప్రోఫెట్ అండ్ ఫాలోయింగ్ హిస్ ఎగ్జాంపుల్).

కాని తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ వారు వెలువరించిన ‘దివ్య ఖుర్ఆన్‌’లో 33:56వ వచనాన్ని-

అల్లాహ్ ఆయన దూతలు దైవ ప్రవక్తకై దురూద్‌ను పంపుతారు. విశ్వాసులారా! మీరు కూడ ఆయనకై దురూద్, సలామ్‌లు పంపండి’ అని అనువదించారు.

(ఇక్కడ యుసల్లూన అనే అరబీ పదాన్ని జి.ఎఫ్. హద్దద్ వలె ధైర్యంగా అనువదించడానికి జడిసి, దురూద్ అనే పారసీక/పర్షియా భాష పదాన్ని వాడి దాని వెనక ఉన్న అసలు అర్థం తెలుగులో వెలుగులోకి రాకుండా ఎంత జాగ్రత్తపడ్డారో గమనించగలరు).

ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ వారు వెలువరించిన ‘ఖుర్‌ఆన్ భావామృతం’ అనే తెలుగు అనువాదంలో కూడా 33:56వ వచనాన్ని ఎలా మార్చి అనువదించారో ఈ క్రింది వచనాన్ని చదివి గమనించగలరు.

దేవుడు, ఆయన దూతలు దైవ ప్రవక్తను దీవిస్తున్నారు. (కనుక) విశ్వాసులారా! మీరు కూడా అతను శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లాలని (దైవాన్ని) ప్రార్థించండి’.

ముస్లింలు ఈ అసత్య అనువాదాలను వదలి సత్యాన్ని అధ్యయనం చేయగలిగిన రోజున తప్పకుండా రక్షణ పొందుతారు.

ఒకవేళ అల్లాహ్ గనుక తనలో బహుళత్వమే లేని అద్వితీయ ఏకత్వము కలిగిన దేవుడైనచో తాను ఎవరికి ఏ విధముగా ప్రార్థన చేశాడో వివరించి మనకు తెలుపగల ముస్లిం అసలు ఎక్కడైనా ఉన్నాడా?

అనుబంధం:-
దేవుడు ప్రార్థించాడు అని చెప్పేది కేవలం క్రైస్తవ్యము మరియు ఇస్లాం మాత్రమే కాదు; యూదా మతములో కూడా అది చూడగలం.

రబ్బీ యోసే చెప్పిన మాటలను ఉటంకిస్తూ రబ్బీ యోహన్నన్ ఇలా అన్నాడు: "పరిశుద్ధుడును, స్తుతులకు పాత్రుడును అయినవాడు ప్రార్థిస్తాడని మనము ఎలా తెలుసుకొనగలము? ఎలాగనగా, ‘నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను’ అని యెషయా 56:7లోలేఖనము చెప్పుచున్నది కాబట్టి. గమనించవలసిన విషయమేమనగా, ‘వారి ప్రార్థన మందిరము’ అని ఆయన అనలేదు, అందుకు విరుద్ధంగా, ‘నా ప్రార్థన’ అని అన్నాడు; కాబట్టి, పరిశుద్ధుడును, స్తుతులకు పాత్రుడును అయినవాడు ప్రార్థన చేస్తాడు అని మనం గ్రహించవచ్చు."
దేవుడు ఏమని ప్రార్థన చేస్తాడు? రవ్ పేరును ఉదాహరిస్తూ తువియా కుమారుడైన రబ్బీ జుత్ర ఇలా ఉటంకించాడు: "నా కృప నా కోపమును అణచుటయే నా చిత్తముగానుండును గాక, మరియు నా పిల్లల పక్షముగా కర్కశమైన న్యాయపరిధిని సమీపించక నా కృపను చూపునట్లు, నా కృప నా [ఇతర] లక్షణములకు పైగా ప్రబలమవును గాక."

ఎలీషా కుమారుడైన రబ్బీ ఇష్మాయేలు ఇలా చెప్పాడని అంటారు :- "ఒకసారి నేను ధూపము వేయడానికి పరిశుద్ధ మందిరములోని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగా, అక్కడ సైన్యములకు అధిపతియైన దేవుడు - అకత్రియేల్ యాహ్, అదోనాయ్ త్సెవా'ఓత్‌ను, అనగా సైన్యములకు అధిపతియైన దేవుని, అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడైయుండగా నేను చూచితిని. ఆయన నాతో 'నా కుమారుడా, నన్ను స్తోత్రించు!' అన్నాడు. అంతట నేను  ‘నీ కృప నీ కోపమును అణచుటయే నీ చిత్తముగానుండును గాక, మరియు నీ పిల్లల పక్షముగా కర్కశమైన న్యాయపరిధిని సమీపించక నీ కృపను చూపునట్లు, నీ కృప నీ [ఇతర] లక్షణములకు పైగా ప్రబలమవును గాక!' అని చెప్పితిని. అప్పుడు దేవుడు సమ్మతముగా తన తలను ఊపాడు."

ఈ సందర్భములో, దీనినుండి మనము నేర్చుకొనినదేమనగా - సాధారణమైన ఒక వ్యక్తి చేయు స్తోత్రమును తక్కువగా ఎంచకూడదు. (బాబిలోనియన్ తాల్మూద్, జెరాయిమ్ I, బెరాకోత్ 7a)

అవ్విధముగా, ఏకేశ్వరోపాసన చేయు మూడు మతములూ దేవుడు వాస్తవానికి  ప్రార్థన చేస్తాడు అని బోధిస్తున్నప్పటికి, క్రైస్తవ్యమొక్కటే దేవుడు ప్రార్థిస్తాడనటానికి అర్థవంతమైన వివరణను ఇస్తుంది. అనగా, ఒంటరియైన ఒక దేవుడు తనకు తానే ప్రార్థన చేసుకున్నాడు అనే అర్థములేని భావనకు విరుద్ధముగా, క్రైస్తవ విశ్వాసములో సదా విడి విడిగా ముగ్గురు వ్యక్తులుగా వ్యక్తమౌతున్న త్రియేక దేవునిలోని ఒకరు మరొకరికి ప్రార్థన చేస్తున్నారు అని బోధిస్తుండటము ఎంతో అర్థవంతముగా కనిపిస్తున్నది కదా!

ఆంగ్ల మూలం:- If Jesus is God ... was he praying to himself?


శాం షమూన్
ఆన్సరింగ్ ఇస్లాం తెలుగు